ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నిరాడంబర జీవనం గడిపే ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఏళ్లు గడుస్తున్నా అదే ఒరవడి సాగిస్తున్నారు. సైకిల్పై వెళ్లడం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం వంటివి ఆయన విషయంలో సర్వ సాధారణంగా కనిపిస్తాయి.
ఈ క్రమంలోనే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షల కోసం బుధవారం ఆయన వచ్చారు. అక్కడ అందరితో పాటే ఓపీ చీటీ తీసుకుని వైద్యుల గది ముందు క్యూలో వేచి ఉండి తన వంతు వచ్చాక కంటి పరీక్ష చేయించుకున్నారు. వార్డు మెంబర్, ఎంపీటీసీలే హంగూ ఆర్భాటాలతో జీవిస్తుండగా 25 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన గుమ్మడి నర్సయ్య అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని పలువురు అభినందించారు.