AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేటీఆర్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధం.. రిమాండ్‌ రిపోర్టే కీలకం

పక్కాగా ఆధారాలు సేకరణ
బీఆర్‌ఎస్‌ నేతల్లో టెన్షన్‌
లగచర్ల ఘటనతో రాజకీయ ప్రకంపనలు
ఇంకా మౌనముద్రలోనే కేసీఆర్‌

వికారాబాద్‌ జిల్లా లగచర్ల దాడి ఘటనతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కలెక్టర్‌ సహా అధికారులపై దాడి వెనుక బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రమేయం ఉందని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొనడం రాజకీయ ప్రకంపనలకు దారి తీస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో కేటీఆర్‌ అరెస్టు తప్పదనే టాక్‌ బలంగా వినిపిస్తోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ని ఇప్పటికే అరెస్టు చేసి విచారించగా.. రాజకీయంగా ప్రయోజనం పొందేందుకే పథకం ప్రకారం కేటీఆర్‌ ఆదేశాలతో దాడి చేసినట్లు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. దాడికి ముందు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న బోగమోని సురేశ్‌తో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ 84 సార్లు ఫోన్లో మాట్లాడటం, పట్నం నరేందర్‌ కేటీఆర్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండటం కీలకంగా మారింది.

ఇక మీడియాతో సురేశ్‌ మా పార్టీకి చెందిన నేతనే అని కేటీఆర్‌ అంగీకరించడం, ఈ కేసును ప్రభుత్వం సీరియస్‌ గా తీసుకుని ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించడం ఉత్కంఠ రేపుతున్నది. విచారణ జరుపుతున్న అధికారులు దాడి వెనుక ఉన్న కుట్ర కోణంలో పక్కాగా ఆధారాలు సేకరించారని తెలుస్తోంది. దీంతో దాడి కేసులో కేటీఆర్‌ మెడకు ఉచ్చు బిగుస్తోందని టాక్‌ వినిపిస్తోంది.

కేటీఆర్‌ ఇంటికి నేతల క్యూ
గత రాత్రే కేటీఆర్‌ పోలీసులు అరెస్టు చేయబోతున్నారనే ప్రచారంతో హైదరాబాద్‌ నందినగర్‌లోని ఆయన ఇంటికి బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేటీఆర్‌ ఇంటికి వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. మాజీ మంత్రి హరీశ్‌ రావు ఇవాళ ఉదయం కేటీఆర్‌ నివాసానికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఏం జరగబోతున్నదనే టెన్షన్‌ బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నెలకొంది.

ఏ క్షణమైనా అరెస్ట్‌..
ఫార్ములా ఈ–రేస్‌ వ్యవహారంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని, ఈ కేసులో కేటీఆర్‌ అరెస్టు కాబోతున్నారని వారం రోజులుగా ప్రచారం జరిగింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్‌ను సైతం కలిసి విచారణకు అనుమతి కోరారు. దీంతో ఏ క్షణమైనా ఈ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌పై చర్యలు తప్పవనే చర్చ జరుగింది. ఈ క్రమంలో అనూహ్యంగా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో కేటీఆర్‌ పేరు తెరపైకి రావడంతో ఫార్ములా ఈ–రేస్‌ కేసులో అరెస్టుకు బదులు ఫార్మా సిటీ భూసేకరణలో కేటీఆర్‌ అరెస్టు కాబోతున్నారా? అనే చర్చ నడుస్తోంది.

మౌనం వీడని గులాబీ బాస్‌
కేటీఆర్‌ అరెస్టు తప్పదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. గతంలో ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవిత అరెస్ట్‌ అయితే దాదాపు నెల రోజుల తర్వాత కేసీఆర్‌ స్పందించారు. ఇప్పుడు ఫార్ములా ఈ–రేస్, లగచర్ల ఘటనలో కేటీఆర్‌ అరెస్టు ప్రచారం, మరో వైపు ఫోన్‌ ట్యాపింగ్‌లో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలకు అధికారులు నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నా కేసీఆర్‌ మౌనం వీడకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

ANN TOP 10