AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రంగంలోకి ఈడీ..! అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..

ఆర్థిక లావాదేవీలపై ఆరా

రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకట భూపాల్‌ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈడీ రంగంలోకి దిగింది. ధరణిని అడ్డం పెట్టుకుని సంపాదించిన అక్రమ రియల్‌ ఎస్టేట్‌ ఆస్తుల విలువ అక్షరాలా రూ. 100 కోట్లని తెలుస్తోంది. 2014 నుంచి 2024 అగస్టు 14వ తేది వరకు సంపాదించిందని ఏసీబీ అధికారులు సోదాల్లో స్పష్టమైంది. దీంతో అదనపు కలెక్టర్‌ భూపాల్‌ రెడ్డి మీద ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నందున కేసు నమోదు చేసి మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులు 41–ఏ కింద నోటీసును ఇచ్చారు.

రూ.8లక్షలు తీసుకుంటూ..

అగస్టు నెలలో ధరణిలో ప్రొహిబిటెడ్‌ ఆప్షన్‌ నుంచి 14 గుంటల స్థలాన్ని తగ్గించేందుకు రూ.8 లక్షలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయినప్పటి నుంచి అదనపు కలెక్టర్‌ మీద అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఈ ఫిర్యాదులపై పూర్తిగా నిఘా పెట్టింది ఏసీబీ.

ఎక్కడెక్కడ విధులు నిర్వహించారు?

ఇదిలా ఉంటే 2014 నుంచి 2024 అగస్టు వరకు అంటే గత 10 ఏండ్లలో అదనపు కలెక్టర్‌ భూపాల్‌ రెడ్డి ఎక్కడెక్కడ విధులు నిర్వహించారు? ఏ విధంగా ఇంత అక్రమార్జన చేశారు..? అనే కోణంలో ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో కీలక మంత్రి దగ్గర భూపాల్‌రెడ్డి ఓఎస్‌ఐగా విధులు నిర్వహించిన విషయం కూడా అధికారులు గుర్తించారు.

ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా..

అదనపు కలెక్టర్‌ భూపాల్‌ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంపై ఈడీ రంగంలోకి దిబోతున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ కూడా రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. వారం రోజుల్లో ఈడీ అధికారులు అదనపు కలెక్టర్‌ అవినీతి, అక్రమాస్తుల లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని ఏసీబీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అంతేకాకుండా ఈ కేసులో భూపాల్‌రెడ్డితో ఆర్థిక లావాదేవీలు జరిపిన వారిని, ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారిని కూడా ఈడీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

ANN TOP 10