బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ (Lal Krishna Advani)కి పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని (BJP active membership) మంగళవారంనాడు అందజేశారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా పురందీశ్వరి సహా పార్టీ సీనియర్ నేతలు అద్వానీ నివాసానికి చేరుకుని ఆయనకు పార్టీ యాక్టివ్ మెంబర్షిప్ అందజేశారు. గౌరవసూచకంగా ఆయనను సన్మానించారు.
బీజేపీ అగ్రనేత అయిన ఎల్కే అడ్వాణి 1927 నవంబర్ 8న జన్మించారు. 1942 వలంటీర్గా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో చేరారు. 1986 నుంచి 1990 వరకూ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేశారు. ఆ తర్వాత 1993 నుంచి 1998 వరకు, 2004 నుంచి 2005 వరకూ కూడా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర హోం శాఖని నిర్వహించారు. 2024లో ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది.
కాగా, బీజేపీ రెండు విడతలుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టగా 10 కోట్లకు పైగా సభ్యత్వ నమోదు జరిగింది. గత సెప్టెంబర్ 2న బీజేపీ-2024 సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టారు. పార్టీ సభ్యత్వ రెన్యువల్ సర్టిఫికెట్ను జేపీ నడ్డా చేతులమీదుగా మోదీ అందుకున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక తంతు కాదని, కుటుంబసభ్యుల విస్తరణ అని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.









