గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క డీఎస్సీ వేయలేదని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. విద్యాశాఖపై సమీక్ష చేపట్టేందుకు కనీసం గంట సమయం కూడా ఇవ్వలేదని విమర్శించారు. సోమవారం జనగామ జిల్లా మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్ (BRS) పార్టీ అధినేత కేసీఆర్(KCR) పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
విద్యాశాఖపై జరుగుతున్న నిర్లక్ష్యం గురించి కేసీఆర్ను అడిగినానని, ఆయన సీఎంగా ఉన్నా కనీసం ఈ విషయాలను పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఈ పరిణామాలన్నీ ఆనాడు సీఎంగా ఉన్న కేసీఆర్ తో పంచుకున్నానని, ప్రభుత్వ విధానాలు సరిగ్గా లేవని చెప్పానన్నారు. దీంతో కేసీఆర్ నన్ను పక్కన పెట్టేశారన్నారు.
బీఆర్ఎస్ పరిపాలనలో ప్రజలకు ఉపయోగపడే పనులు ఒక్కటి కూడా జరగలేదని కడియం ఎద్దేవా చేశారు. కమిషన్లు వచ్చే పనులు మాత్రమే చేసుకున్నారని, కల్వకుంట్ల కుటుంబం పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుందన్నారు. ఆ కుటుంబం దోపిడిని ప్రశ్నించినందుకే, తనపై అక్కసు పెంచుకున్నారన్నారు. దీంతో తనను పక్కన పెట్టారన్నారు.
బీఆర్ఎస్ అంటే అది పార్టీ కాదని, బీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్, సంతోష్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. రాష్ట్రం వచ్చిన కొత్తలో కేసీఆర్ కి ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఇప్పుడెన్ని ఉన్నాయో వెల్లడించాలని సవాల్ చేశారు.









