గ్రూప్–1 పరీక్ష విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతం జరుగుతున్న గ్రూప్–1 పరీక్షలను వాయిదా వేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టులో దీనిపై విచారణ కొనసాగుతోందని, తుది నియామకాలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అక్కడే విచారణ జరపాలని ఆదేశించింది. ఫలితాలు వెల్లడించ డానికి ముందే తుది తీర్పు ఇవ్వాలని హైకోర్టుకి సూచన చేసింది.
విద్యార్థుల పిటిషన్లో..
తెలంగాణాలో గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు ఆపాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం ఉదయం విచారణకు స్వీకరించింది. గ్రూప్ –1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని, ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ విద్యార్థులు పిటిషన్లలో ప్రస్తావించారు.
వాదనలు విన్న అనంతరం..
అభ్యర్థుల తరపున కపిల్ సిబాల్, నిరంజన్ రెడ్డి తమ వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ మనుసింఘ్వీ తన వాదనలు వినిపించారు. పరీక్ష జరుగుతుండడంతో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేని తేల్చేసింది సుప్రీంకోర్టు. ఇప్పటికే విద్యార్థులు పరీక్షా కేంద్రాలను వెళ్లారన్న సీజేఐ. ఈ పరిస్థితుల్లో స్టే ఇవ్వలేమని తేల్చేసింది ధర్మాసనం. తెలంగాణ హైకోర్టులో తేల్చుకోవాలని సూచన చేసింది.
పరీక్షలకు లైన్ క్లియర్
దీంతో చాలా ఏళ్ల తర్వాత తెలంగాణలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సీఎం రేవంత్రెడ్డి రియాక్ట్ అయ్యారు. సోమవారం నుంచి గ్రూప్ –1 మెయిన్స్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందకుండా, పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలన్నారు. ఈ పరీక్షల్లో మీరు విజయం సాధించి, తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎక్స్లో రాసుకొచ్చారు.









