– ఏదైనా సాధించాలంటే రిస్క్ తప్పనిసరి
– సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో జరిగిన లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ను 600 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని భావిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీరు ఈ విజన్ ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలన్నారు.
మీరు ఎక్కడికి వెళ్లినా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, సామాన్య ప్రజలతో తెలంగాణ, హైదరాబాద్ గురించి వివరించాలని సూచించారు. హైదరాబాద్ భారతదేశంలోని నగరాలతోనే కాదు.. ప్రపంచ నగరాలైన న్యూయార్క్, లండన్, పారిస్, టోక్యో, సియోల్తో పోట పడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇది కష్టం కానీ.. అసాధ్యం మాత్రం కాదన్నారు. భవిష్యత్లో కొత్త సవాళ్లు, అవకాశాలను అందిపుచ్చుకునే తెలంగాణ ప్రభుత్వంతో విద్యార్థులు సహకరించాలన్నారు. రాజకీయాల నుంచి నాయకత్వం ఏమిటో తెలుసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ కు అద్భుతమైన వారసత్వం ఉందని.. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి నాయకులే దీనికి ఉదాహరణ అని చెప్పారు.
‘ కొన్ని గొప్ప పనులు చేయాలంటే..రిస్క్ తీసుకోక తప్పదని అన్నారు. రిస్క్ లేనిదే ఏం సాధించలేమన్నారు. పేదలు, ధనికులు, చిన్నా, పెద్దా అన్న భేదం లేకుండా అందరిని కలుపుకుని వెళ్లినప్పుడే గొప్ప నాయకుడు అవుతాడని చెప్పారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని.. అలాగే గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. తాను సౌత్ కొరియాలో స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించినట్లు రేవంత్ గుర్తు చేశారు.









