AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మనీలాండరింగ్‌ కేసులో నటి తమన్నాను విచారించిన ఈడీ..

హెచ్‌పీజెడ్‌ టోకెన్‌ మొబైల్‌ యాప్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ప్రముఖ నటి తమన్నా భాటియాను ప్రశ్నించినట్లు ఈడీ అధికార వర్గాలు తెలిపాయి. యాప్‌ ద్వారా బిట్‌కాయిన్‌, క్రిప్టోకరెన్సీలను మైనింగ్‌ సాకుతో చాలామంది ఇన్వెస్టర్లను మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే, ఇందులో తమన్నా భాటియాపై ఎలాంటి నేరారోపణలు లేవు. కానీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గౌహతి కార్యాలయంలో విచారించింది. అంతకు ముందు ఈడీ కార్యాలయానికి తమన్నా తల్లితో కలిసి చేరుకుంది. ప్రస్తుతం ఇంకా వాంగ్మూలం తీసుకుంటున్నట్లు సమాచారం. యాప్‌ని ప్రమోట్‌ చేశారని.. అందుకు కొంత డబ్బు తీసుకున్నారని, ఆమెపై ఎలాంటి నేరారోపణలు లేవని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.

తమన్నాను ఈడీ విచారించడం ఇది రెండోసారి. ఇంతకు ముందు మహాదేవ బెట్టింగ్‌ యాప్‌ కేసులో విచారించింది. మహాదేవ అనుబంధ సంస్థ అయిన ఫెయిర్‌ప్లే యాప్‌లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ గేమ్‌ మ్యాచ్‌లను ప్రసారం చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై మహారాష్ట్ర సైబల్‌ సెల్‌ ఏప్రిల్‌ను విచారణకు పిలిచింది. మార్చిలో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో 76 చైనీస్‌ నియంత్రిత సంస్థలతో సహా 299 సంస్థలను నిందితులుగా చేర్చింది. ఇందులో పది మంది చైనీస్‌ మూలాలు ఉన్న డైరెక్టర్లు ఉన్నారు. రెండు సంస్థలు ఇతర విదేశీ పౌరులతో నియంత్రించబడుతున్నాయని పేర్కొంది. కొహిమా పోలీసులకు చెందిన సైబర్‌ క్రైమ్‌ యూనిట్‌ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా మనీలాండరింగ్‌ కేసు వెలుగులోకి వచ్చింది.

ఇందులో బిట్‌కాయిన్‌, ఇతరత్రా భారీ రాబడి వస్తుందని చెప్పి పెట్టుబడిదారులను మోసగించినందుకు ఐపీసీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. నిందితులు పెట్టుబడిదారులను మోసం చేసేందుకు ‘హెచ్‌పీజెడ్ టోకెన్’ మొబైల్ ఫోన్ అప్లికేషన్‌ను ఉపయోగించారని పోలీసులు తెలిపారు. నేరాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తరలించేందుకు డమ్మీ డైరెక్టర్లతో షెల్‌ కంపెనీల తరఫున బ్యాంకు ఖాతాలు, మర్చంట్‌ ఐడీలు తెరిచినట్లు ఈడీ పేర్కొంది. రూ.57వేల పెట్టుబడి పెడితే మూడునెలల పాటు రోజుకు రూ.4వేల రిటర్న్స్‌ ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. అయితే, పెట్టుబడి పెట్టిన వారికి కేవలం ఒక నెల మాత్రమే డబ్బులు చెల్లించారు. ఈ తర్వాత ఈడీ దాడులు నిర్వహించి రూ.455కోట్ల విలువైన స్థిరాస్తులు, డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నది.

ANN TOP 10