హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సీబీఐ అరెస్ట్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీ రెండు వేర్వేరు పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ నెల 5న విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు రెండు పిటిషన్లపైనా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. కేజ్రీకి షరతులతో (conditions) కూడిన బెయిల్ మంజూరు చేసింది.
కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు పెట్టిన షరతులు ఇవే..
- రూ.10లక్షల బాండ్ సమర్పించాలి
- కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దు
- కేసు విచారణ కోసం ట్రయల్ కోర్టు ఎదుట హాజరుకావాలి
- ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లకూడదు
- అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయకూడదు









