తెలంగాణలో ఈ నెల 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. రోడ్లపై జనం ఎక్కువ మంది గుమిగూడటంపై ఆంక్షలు విధిస్తూ మూడు కమిషనరేట్లకు సంబంధించిన పోలీస్ కమిషనర్లు ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల నుంచి 14న ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టంచేశారు.
పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు ప్రకటించారు. పోలింగ్ కేంద్రం పరిధిలో ఐదుగురు అంతకుమించి గుమిగూడవద్దని పోలీసులు స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు అన్ని రకాల ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమల్లో ఉంటుందని తెలియజేశారు. ఏ లైసెన్సు కింద అనుమతి ఉన్నప్పటికీ మద్యం విక్రయాలపై ఆంక్షలు ఉంటాయని స్పష్టంచేశారు.
13వ తేదీన పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లు రెండు క్యూలైన్లలో నిలబడాలని.. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా క్యూలైన్లు ఉంటాయని పోలీసులు తెలిపారు. రెండు కంటే ఎక్కువ లైన్లలో ఉండటాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని చెప్పారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని పోలీస్ కమిషనర్లు హెచ్చరించారు. ఆంక్షల సమయంలో మైకులు, స్పీకర్ల ద్వారా పాటలు పెట్టడం, ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు చేయడం నిషిద్ధమని అన్నారు.
‘మద్యం డ్రై డే’ను అమలు చేయాలి : సీఈవో
మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, బార్లు, మద్యం విక్రయించే అన్ని సంస్థలను మూసేయాలని, రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసినప్పటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు మద్యం అమ్మకాలకు అనుమతి లేదని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి (సీఈవో) వికాస్ రాజ్ ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు రోజున మద్యం దుకాణాలు తెరవరాదని స్పష్టంచేశారు. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి 13న సాయంత్రం 6 వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.









