తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శంకరమ్మకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు. శంకరమ్మ కుటుంబం రాష్ట్రానికి చేసిన త్యాగం కాంగ్రెస్ పార్టీ మరవదని మంత్రి తెలిపారు. గురువారం శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గాంధీభవన్లో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాకు చెందిన వందలాది మంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఉత్సాహంగా ఉన్న నేతలను పార్టీలో చేర్చుకోవాలని ఏఐసీసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని తెలిపారు.
హుజుర్నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అబద్ధాలు ప్రచారం చేసుకుని గెలవాలని ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. మోదీ దిగజారి మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోదీ (PM Modi) చేసిన అభివృద్ధి శూన్యమని వ్యాఖ్యలు చేశారు. అదాని కాంగ్రెస్ మనిషి అన్నట్లు మోదీ మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇండియా కూటమి కేంద్రంలో, అధికారంలోకి వస్తుందన్న సమాచారంతోనే మోదీ భయంతో మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ 10 ఏళ్ళు సీఎంగా ఉండి రాష్ట్రాన్ని నాశనం చేశారని విరుచుకుపడ్డారు. తడిసిన ధాన్యాన్ని ఎమ్మెస్పీ ధరకు ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తవగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.









