(అమ్మన్యూస్, హైదరాబాద్):
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో మే 13న తెలంగాణ, ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రస్తుత అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై మండిపడ్డారు. పోలింగ్ రోజు నుంచి ఇక∙ప్రజలందరూ కింది ఉత్పత్తులను సిద్ధం చేసుకోవాలని కోరారు. వాటిలో ఆరు గ్యారంటీలు 1. ఇన్వర్టర్, 2. ఛార్జింగ్ బల్బులు, 3. టార్చ్ లైట్లు, 4. కొవ్వొత్తులు, 5. జనరేటర్లు, 6. పవర్ బ్యాంకులు ఉన్నాయని పేర్కొన్నారు.
అంతేకాదు ఇది కాంగ్రెస్ పాలన అని గుర్తుంచుకోవాలని, మే 13న తెలివిగా ఓటు వేయాలని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రజలను కోరారు. ఆ క్రమంలో ఓట్ ఫర్ కారు, ఓట్ ఫర్ తెలంగాణ అంటూ పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ నేతల భగ్గు
మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలను పలువురు కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా అనేక ప్రాంతాల్లో విద్యుత్ కోత సమస్యలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం వర్షం రాక సహా అనేక సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.









