ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. బద్వేల్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదు అయ్యింది. మే 2వ తేదీన బద్వేల్ బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ షర్మిల.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ప్రసంగించారు. దాంతో షర్మిలపై బద్వేల్ నోడల్ అధికారి, మున్సిపల్ కమిషనర్లు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద ఆమె మీద కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు అంశంపై మాట్లాడొద్దని ఇటీవల కడప కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్యను ప్రస్తావిస్తూ రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వైసీపీ నేత ఒకరు కడప కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనిని అడ్డుకునేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం.. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసును ప్రస్తావించ వద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే వైఎస్ షర్మిల మాత్రం కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ బద్వేల్లో నిర్వహించిన బహిరంగా సభలో వివేకా హత్య కేసును ప్రస్తావించారని అధికారులు ఫిర్యాదు చేశారు.









