మెగా కుటుంబానికి చెందిన సినీ నటుడు సాయి ధరమ్ తేజ్పై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించారు. జనసేనాధినేత పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో.. ఆకతాయిలు ఆయనపై డ్రింక్ బాటిల్స్ విసిరారు. కాకానాడలోని పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. ఈ దాడిలో సాయి ధరమ్ తేజ్కి త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. ఆయన పక్కనే ఉన్న జనసేన వీరాభిమాని నల్ల శ్రీధర్కు ఆ బాటిల్ తగిలింది. దీంతో.. అతని కంటిపై గాయమై, తీవ్ర రక్తస్రావమైంది.
ఈ ఘటనతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమై.. నిందితుల్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇది వైసీపీ స్థానిక నేతల పనే అయ్యుండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతకుముందు కూడా సాయి ధరమ్ తేజ్ రోడ్ షోలో భాగంగా తాటిపర్తి నుంచి చిన్న జగ్గంపేట వెళ్తున్న సమయంలోనూ వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. బాణసంచా బాంబులు వేస్తూ హల్చల్ చేశారు. అంతేకాదు.. జనసేన శ్రేణులు, మెగా అభిమానులతోనూ వాగ్వివాదానికి దిగారు. తద్వారా.. అక్కడ కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. అప్పుడు పోలీసులు రంగంలోకి దిగి, జనసేన శ్రేణులను నియంత్రించి, వైసీపీ వారిని వదిలేశారు.
అప్పటికీ ఆగని వైసీపీ శ్రేణులు.. తాటిపర్తి గజ్జలమ్మ గుడి సెంటర్ వద్దకు సాయి ధరమ్ తేజ్ రోడ్ షో చేరుకోగానే మళ్లీ దాడి చేశారు. డ్రింక్ బాటిల్స్తో ఎటాక్ చేయగా.. దీన్నుంచి అతను తృటిలో తప్పించుకోగలిగాడు. కానీ.. పక్కనే ఉన్న నల్ల శ్రీధర్కు మాత్రం పెద్ద దెబ్బ తగిలింది. దాదాపు కన్ను పోయే పరిస్థితి నెలకొంది. ఈ దాడిని పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. కాగా.. గతంలోనూ పవన్ కళ్యాణ్పై ఓ దుండగుడు పవన్పై రాయి విసిరిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు.. సభకు విచ్చేసిన వారిలో దుండగులు రాళ్లు విసిరి.. పవన్ని గాయపరిచే ప్రయత్నం చేశారు.









