సొంతగడ్డపై జరిగిన ఉత్కంఠ పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. రాజస్థాన్పై ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. 202 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 200 పరుగుల వద్దే పరిమితమైంది. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరాగ్, జైస్వాల్ హాఫ్ సెంచరీలు వృథా అయ్యాయి. చివరలో పొవెల్ రాజస్థాన్ను విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేసినప్పటికీ.. చివరి బంతికి ఎల్బీడబ్ల్యూ కావడంతో ఓటమి తప్పలేదు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్తో రికార్డు సృష్టించిన హైదరాబాద్ ఆటగాళ్లను రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు ఆది నుంచి కట్టడి చేశారు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 37 పరుగుల వద్దే పరిమితమైంది. ఐదో ఓవర్లో అవేశ్ ఖాన్ వేసిన తొలి బంతికి షాట్ ఆడేందుకు ప్రయత్నించి అభిషేక్ (12) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అన్మోల్ప్రీత్(5) తొలి బంతికే ఫోర్ బాదాడు. కానీ ఆరో ఓవర్లో సందీప్ శర్మ వేసిన బంతికి జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో రెండు కీలక వికెట్లను కోల్పోయిన సన్రైజర్స్ కాసేపు నిలకడగా ఆడింది. కానీ 9వ ఓవర్ నుంచి ట్రావిస్ హెడ్ (58) దూకుడు పెంచాడు. అతనికి నితీశ్రెడ్డి జత కలిశాడు. దీంతో ఇద్దరూ కలిసి చెరో హాఫ్ సెంచరీతో జట్టుకు కీలకమైన స్కోర్ అందించారు. అయితే అవేశ్ ఖాన్ వేసిన 15వ ఓవర్లో మూడో బంతికి స్టంపౌట్ నుంచి తప్పించుకున్నప్పటికీ.. నాలుగో బంతికి హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హెడ్ ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన క్లాసెస్ (40) కూడా రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోర్ను ఎట్టకేలకు 200 దాటించారు. రాజస్థాన్ ముందు 202 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.
టార్గెట్ చేధనలో భాగంగా బరిలోకి దిగిన రాజస్థాన్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. భువనేశ్వర్ వేసిన మొదటి ఓవర్లో రెండో బంతిని ఎదుర్కొన్న బట్లర్ (0) జాన్సెన్కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ (0) క్లీన్బౌల్డ్ అయి పెవిలియన్ చేరారు. కానీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ (77), ఓపెనర్ జైస్వాల్(67)తో కలిసి విజృంభించాడు. పవర్ ప్లేలోపే వీళ్లిద్దరూ ఔటవ్వాల్సింది కానీ రెండు సందర్భాల్లోనూ క్యాచ్ మిస్సవ్వడం వీరికి కలిసొచ్చింది.









