శతాబ్ధి వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎంతో మంది ప్రముఖులను అందించిందని, దేశానికి గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. అలాంటి పాఠశాల నేడు శతాబ్ధి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. మంగళవారం (డిసెంబర్ 19) బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది వేడుకలకు ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతో పాటు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి సీతక్క, పలువురు అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ద్రౌపది ముర్ము జెండా ఊపి పబ్లిక్ స్కూల్ శతాబ్ధి ఉత్సవాలను ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా వందేళ్ల చరిత్ర కలిగిన హెచ్పీస్ మ్యూజియంను ముర్ము సందర్శించారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ‘ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎంతో మంది ప్రముఖులను దేశానికి అందించింది. అలాగే ఈ పాఠశాల ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచి దేశానికి గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టింది. విభిన్న నేపథ్యాల నుండి విద్యార్థులు కలిసి చదువుకోవడానికి, ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడానికి ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించినందుకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. భవిష్యత్లో ఈ పాఠశాల మరిన్ని శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
అనంతరం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర, దేశాభివృద్ధికి పాటుపడిన ఎంతో మంది ప్రముఖులను ఈ పాఠశాల తయారు చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, బ్యాంకింగ్ దిగ్గజాలు, సీఏలు, న్యాయవాదులు.. ఇలా పలు రంగాలకు చెందిన ప్రముఖులు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. క్రీడలు, విద్యా కార్యకలాపాలు విద్యాసంస్థలకు రెండు కళ్ళు కాబట్టి విద్యార్థులు చదువుపైనే కాకుండా క్రీడలపై కూడా దృష్టి సారించాలి’ అని పేర్కొన్నారు. శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా స్కూల్ యాజమాన్యానికి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.









