తన సినిమాలు చూసి ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలని బీజేపీ నేత విజయశాంతి(Vijaya Shanthi) అన్నారు. లక్డీకాపూల్ లోని వాసవి కళ్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో విజయశాంతి పాల్గొన్నారు. మహిళా సంఘాల నేతలు కాలేజీల్లోకి వెళ్లి మహిళల సమస్యల పట్ల చర్చలు పెట్టి అవగాహన కల్పించాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే తల్లిదండ్రులు పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పారు. సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకోవాలే తప్ప మహిళలు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు.
సొసైటీలో మహిళలు అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నారని విజయశాంతి అన్నారు. మహిళలకు ఏదైనా భాద్యత అప్పచెప్పితే పూర్తిగా న్యాయం చేస్తారని చెప్పారు. సంసారంలో భర్త తాగుబోతు అయినా.. మహిళలు సంసారాన్ని సక్కబెడతారని అన్నారు. ఆడవాళ్లకు అత్త వయసు వచ్చినప్పుడు కోడలుపై డామినేషన్ ఉంటుందన్నారు. సమాజంలో అత్త పాత్ర చాలా గొప్పదన్నారు. కొడుకు, కోడలు కొట్లాడితే అత్త సర్ది చెప్పాలన్నారు. అత్త కోడల్ని సొంత బిడ్డలా చూసుకోలని సూచించారు.