AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

75 ఏళ్ల తర్వాత కశ్మీరులో శారదా దేవికి శరన్నవరాత్రి పూజలు(వీడియో)

జమ్మూ కశ్మీరులోని కుప్వారా జిల్లా తీత్వల్ గ్రామంలోని శారదా దేవి ఆలయంలో 1947 తర్వాత మొట్టమొదటిసారి నవరాత్రి పూజలు జరిగాయి. వాస్తవాధీన రేఖ సమీపంలో ఉన్న ఈ గ్రామంలోని శారదా దేవి ఆలయంలో శరన్నవ రాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా సోమవారం వైభవంగా పూజలు జరిగాయి. ఈ చారిత్రాత్మక విశేషాన్ని తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి వందలాది మంది భక్తులు తరలి వచ్చారు.

హంపికి చెందిన స్వామి గోవిందానంద సరస్వతి తన అనుచరులతో ఆంజనేయ స్వామి జన్మస్థానం కలసి కర్నాటకలోని కిష్కింద నుంచి రథ యాత్రలో ఇక్కడకు చేరుకున్నారు. అమ్మవాది పూజలో కొందరు కశ్మీరీ పండిట్లు కూడా పాల్గొన్నారు. కశ్మీరీ ఫైల్స్ చిత్రంలో నటించిన రంగస్థల నటుడు ఎకె రాణా కూడా వీరిలో ఉన్నారు.

తీత్వల్ గ్రామంలోని శారదా దేవి ఆలయం, ఒక గురుద్వారను 1947లో గిరిజన తెగలవారు తగలబెట్టారు. ఆ తర్వాత అదే స్థలంలో, గతంలో ఉన్న విధంగానే ఆలయాన్ని, గురుద్వారను ప్రభుత్వం నిర్మించింది. 2023 మార్చి 23న వీటిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. 75 సంవత్సరాల తర్వాత చారిత్రాత్మకమైన ఈ ఆలయంలో నవరాత్రి పూజలు మొట్టమొదటిసారి జరగడం ఆనందదాయకమని అమిత్ షా ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అత్యంత పురాతనమైన శారదాదేవి మందిరం 18 మహా శక్తి పీఠాలలో ఒకటి. పాక్ ఆక్రమిత కశ్మీరులోని నీలం లోయంలో ఈ ఆలయం శిథిల దశలో ఉండేది. శారదాదేవిని సరస్వతీ దేవి అమ్మవారి అవతారంగా భక్తులు కొలుస్తారు. పురాణాల ప్రకారం.. ఈ ఆలయాన్ని పాండువులు తమ వనవాస కాలంలో నిర్మించారు. 8వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన లలితాదిత్య ముక్తాపిద రాజు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని భక్తులు విశ్వసిస్తారు.

ANN TOP 10