AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇక రంగంలోకి గులాబీ దళపతి.. నేడే బీఆర్ఎస్ మేనిఫెస్టో..

తెలంగాణలో రాజకీయం కాకరేపుతోంది. ఇప్పటివరకూ ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టు మారిపోయింది పొలిటికల్‌ సీన్‌. ఎన్నికల షెడ్యూల్‌ అలా విడుదలయ్యిందో లేదో ఒక్కసారిగా స్పీడ్‌ పెంచేశాయ్‌ పార్టీలు. గెలుపే లక్ష్యంగా దూకుడు రెట్టింపు చేశాయ్‌. కాంగ్రెస్‌, బీజేపీతో పోలిస్తే అధికార పార్టీ బీఆర్‌ఎస్సే స్పీడుమీదుంది. ఎలక్షన్‌ షెడ్యూల్‌ రాకముందు నుంచే కేటీఆర్‌ జిల్లాలను చుట్టేస్తుంటే, ఆదివారం నుంచి రంగంలోకి దిగుతున్నారు గులాబీ బాస్‌.

అక్టోబర్ 15వ తేదీన బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ప్రకటించడమే కాకుండా హుస్నాబాద్‌ సభతో సమరశంఖం పూరించేందుకు రెడీ అవుతున్నారు కేసీఆర్‌. కాంగ్రెస్‌ గ్యారెంటీలు, బీజేపీ హామీలను తలదన్నేలా బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ఉండబోతోందంటూ ఇప్పటికే లీకులిచ్చారు కేటీఆర్‌. ఈసారి మేనిఫెస్టో సరికొత్తగా, ఆసక్తికరంగా ఉంటుందంటూ చెప్పుకొస్తున్నారు. అయితే, బీఆర్‌ఎస్‌ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం ఇప్పటికే అమలవుతోన్న పథకాలు కొనసాగించడం, వాటి పరిధిని పెంచబోతున్నట్టు తెలుస్తోంది.

హుస్నాబాద్ సభకు ఏర్పాట్లు..
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఈ నెల 15న జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ పనులు శరవేగంగా జరుగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ తెలిపారు. ఇప్పటికే హెలిప్యాడ్ నిర్మాణం పూర్తయిందని, సభాస్థలి వేదిక పనులు రేపటి వరకు పూర్తవుతాయన్నారు. సీఎం కేసీఆర్ సభాస్థలంలో జరుగుతున్న ఏర్పాట్లను పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే సతీష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ కు లక్ష్మీ నియోజకవర్గమని, గతంలో 2014 ,2018 రెండుసార్లు హుస్నాబాద్ నుండి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని బహిరంగ సభ ద్వారా ప్రారంభించారని గుర్తు చేశారు. మూడోసారి హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభంజనం సృష్టించబోతుందన్నారు. బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయని మహిళలకు, వికలాంగులకు ప్రత్యేకమైన గాలరీలు ఏర్పాటు చేశామని, సభలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు.

ANN TOP 10