AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పల్లా గెలుపు కోసం కేసీఆర్ స్పెషల్ కేర్.. అనూహ్యంగా ఆయనకు బాధ్యతలు..!

అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముందున్న బీఆర్ఎస్.. తాజాగా 54 నియోజకవర్గాలకు ఎలక్షన్ క్యాంపెయిన్ ఇంఛార్జీలను నియమించింది. వీటిలో మెజార్టీ నియోజకవర్గాలకు ఒకరు లేదా ఇద్దరు ఇంఛార్జిలను నియమించిన బీఆర్ఎస్.. కేవలం మూడు స్థానాలకు మాత్రం ముగ్గురు చొప్పున ఇంఛార్జిలను నియమించింది. అందులో రెండు సీఎం కేసీఆర్ పోటీ చేయనున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలు కాగా.. మరొకటి పల్లా రాజేశ్వర రెడ్డి పోటీ చేయనున్నట్లు ప్రకటించిన జనగామ కావడం గమనార్హం.

కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌ నియోజకవర్గ ఎన్నికల ప్రచార బాధ్యతలను హరీశ్ రావు, డాక్టర్ యాదవ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డికి బీఆర్ఎస్ కట్టబెట్టింది. వంటేరు ప్రతాప రెడ్డి గత రెండు పర్యాయాలు కేసీఆర్‌కు ప్రత్యర్థిగా బరిలోకి దిగి.. 2018 ఎన్నికల తర్వాత గులాబీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.

ఇక జనగామలో పల్లా రాజేశ్వర రెడ్డిని గెలిపించడం కోసం ప్రచార బాధ్యతలను మంత్రి హరీశ్ రావు, బి.వెంకటేశ్వర్లు, డాక్టర్ తాటికొండ రాజయ్యకు అప్పగించింది. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు జనగామ బాధ్యతలను అప్పగించడం గమనార్హం. కామారెడ్డిలో ప్రస్తుత ఎమ్మెల్యే గంగా గోవర్ధన్‌ను ఇంచార్జిగా నియమించిన బీఆర్ఎస్ అధిష్టానం.. జనగామలో మాత్రం ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కాదని.. టికెట్ దక్కని మరో ఎమ్మెల్యే రాజయ్యను నియమించడం గమనార్హం.

కామారెడ్డి, గజ్వేల్‌, జనగామ నియోజకవర్గాలకు ముగ్గురేసి చొప్పున ఇంఛార్జీలను ప్రకటించిన బీఆర్ఎస్.. అందులో గజ్వేల్, జనగామ నియోజకవర్గాల బాధ్యతలను ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు అప్పగించింది. దీంతో జనగామలో పల్లా గెలుపు బాధ్యతను కేసీఆర్ ప్రెస్టేజీగా తీసుకున్నట్టు కనిపిస్తోంది.

ANN TOP 10