హైదరాబాద్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయం కాగా.. నిన్న ఓ మహిళ నాలాలో గల్లంతు కాగా.. ఈరోజు ఓ నాలుగేళ్ల చిన్నారి నాలాలో పడి మృతి చెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రగతి నగర్ నాలాలో ఒక బాలుడి మృతదేహం కొట్టుకు వచ్చింది. గత 2 రోజులుగా నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా.. లోతట్టు ప్రాంతాలకు వరదలు పొటెత్తాయి. ఫలితంగా నాలాలు వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి. అయితే ఒక నాలుగేళ్ల బాలుడు నాలాలో పడి కొట్టుకుపోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రగతినగర్లోని సాయినగర్ కల్వర్టు వద్ద ఉన్న నాలా పక్కనే నితిన్ అనే బాలుడు సరదాగా ఆడుకుంటున్న సమయంలో.. ప్రమాదవశాత్తు నాలాలో పడి కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు.. ఆ పిల్లడిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితంగా లేకుండా పోయింది. దీంతో.. వెంటనే స్థానికులు, పోలీసులకు సమాచారాన్ని అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు… హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. పోలీసులు కూడా బాలుడిని కాపాడలేకపోయారు. చివరికి.. రాజీవ్ స్వగృహ వద్ద బాలుని మృతదేహం లభ్యమైంది.
మృతదేహాన్ని పోలీసులు నాలాలో నుంచి వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటివరకు ఎంతో ఆనందంగా ఆడుకుంటున్న చిన్నారి.. క్షణాల్లోనే నాలాలో పడి విగత జీవిగా దొరకటంతో ఆ బాలుడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.









