AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తాటికొండ రాజయ్య బిగ్ ట్విస్ట్.. దామోదరతో రహస్య భేటీ..

తెలంగాణ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. గంట గంటకు సమీకరణాలు మారిపోతూ.. ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార పార్టీ అందరికంటే ముందుగానే అభ్యర్థుల జాబితా ప్రకటించటంతో.. తెలంగాణ రాజకీయాలు మొత్తం హాట్ హాట్‌గా మారిపోయాయి. అయితే.. టికెట్ ఆశించి భంగపడిన నేతలు వేస్తున్న అడుగులు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ క్రమంలో.. స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారిపోయింది. ఈసారి కడియం శ్రీహరికే టికెట్‌ ఇవ్వటంతో.. రాజయ్య పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. అందరూ అసంతృప్తులు తలో దారి వెతుక్కుంటుండగా.. ఆయన మాత్రం ఆశావాహ దృక్పథంతోనే ఉన్నారు. అయితే.. బయటకు కనిపించేది వేరే లోలోపల జరుగుతుంది వేరే అని ఈరోజు బహిర్గతమైంది.

బీఆర్ఎస్ అధిష్ఠానంపై రాజయ్య బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయకపోయినా.. తన నిరాశను మాత్రం వెలిబుచ్చుతూనే ఉన్నారు. ఈ క్రమంలో రాజయ్యకు ఇతర పార్టీ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. రాజయ్య రహస్య భేటీ ఇప్పుడు కలకలం రేపుతోంది. మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో రాజయ్య వరంగల్‌లోని ఓ హోటల్‌లో కలుసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఇద్దరు నేతలు సుమారు 45 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. రాజయ్యను దామోదర రాజనర్సింహ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

అయితే.. రాజనర్సింహ ఆహ్వానంపై రాజయ్య సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తోంది. ఈ భేటీతో రాజయ్య కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమనే గుసగుస వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరగా.. తాజాగా తుమ్మల నాగేశ్వర్ రావు కూడా చేరటం ఖాయంగా కనిపిస్తున్న వేళ.. రాజయ్య కూడా హస్తంలో చేరేందుకు సుముఖత చూపించటంతో తెలంగాణ రాజకీయం రంజుగా మారబోతోందని విశ్లేషకులు చెప్తున్నారు.

ANN TOP 10