ఆసియా కప్ 2023లో టీమిండియా సూపర్-4లోకి అడుగుపెట్టింది. నేపాల్తో జరిగిన చివరి గ్రూప్ దశ మ్యాచులో పది వికెట్ల తేడాతో విజయం సాధించిన మూడు పాయింట్లతో తదుపరి దశకు అర్హత సాధించింది. ఈ మ్యాచులో తొలుత టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నేపాల్కు బ్యాటింగ్ అప్పగించాడు. ఆ జట్టు బ్యాటర్లు ప్రతిఘటించడంతో నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు, సిరాజ్ 3, షమీ 1, హార్దిక్ పాండ్యా 1, శార్దుల్ ఠాకూర్ 1 వికెట్ పడగొట్టారు.
అనంతరం ఛేజింగ్ మొదలుపెట్టిన భారత్.. 2.1 ఓవర్లలో 17/0 పరుగులు చేసిన దశలో వర్షం మ్యాచ్కు అంతరాయం కలిగించింది. దీంతో ఆట చాలా సేపు నిలిచిపోయింది. చివరకు వర్షం తగ్గడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిలో లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145గా అంపైర్లు కుదించారు. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్లు నేపాల్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ లక్ష్యాని కరిగించారు. ఒక్కవికెట్ కూడా ఇవ్వకుండా 20.1 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేశారు. రోహిత్ శర్మ(74), శుభ్మన్ గిల్(67) నాటౌట్లుగా నిలిచారు.
భారత్ సూపర్-4 దశకు చేరడంతో సెప్టెంబర్ 10న పాకిస్థాన్తో మరోసారి తలపడనుంది. సెప్టెంబర్ 12, సెప్టెంబర్ 15న మిగతా రెండు మ్యాచులు ఆడుతుంది. గ్రూప్-బిలో నుంచి సూపర్-4 అర్హత సాధించిన జట్లతో భారత్ ఈ మ్యాచులు ఆడనుంది.









