మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. ఈ నెల 8న సాయంత్రం 6 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుందని బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం తయారీలో భాగంగా ఈ నెల 7న ఉదయం 11 గంటలకు దూద్బౌలిలోని ఆయన స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం, బావి పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు.
అనంతరం 8వ తేదీ సాయంత్రం దూద్బౌలిలోని స్వగృహంలో కుటుంబ సభ్యులంతా చేప ప్రసాదాన్ని తీసుకున్న అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పంపిణీ ప్రారంభమవుతుంది. కాగా.. చేప ప్రసాదానికి 171 ఏళ్ల చరిత్ర ఉందని బత్తిని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రతి ఏడాది పాతబస్తీ దూద్బౌలిలోని తమ స్వగహంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చేప ప్రసాదాన్ని తయారు చేస్తారు.ఇంటి బావిలోని నీటితోనే ఈ చేప ప్రసాదాన్ని తయారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పూర్వీకుల నుంచి ఈ బావిలోని నీటినే వాడుతున్నారు. ఇప్పటికీ ఈ బావిలో నీరు సమృద్ధిగా ఉంది.









