తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమారికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన యువకుడు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. సిరిసిల్ల ప్రాంతానికి చెందిన ప్రముఖ చేనేత కార్మికుడు నల్ల విజయ్ కుమార్ మీరా కుమారికి అగ్గిపెట్టెలో ఇమిడే చీరను బహుకరించారు. ప్రత్యేకంగా తయారు చేసిన చీరను మాజీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్తో కలిసి ఆమెకు అందజేశాడు.
అగ్గిపెట్టలో ఇమిడే చీరను చూసిన మీరా కుమారి ఆశ్చర్యపోయారు. ‘వావ్.. అమేజింగ్’ అంటూ చేనేత కార్మికుడు నల్ల విజయ్ను ఆమె ప్రశంసించారు. ఈ సందర్భంగా నల్ల విజయ్ గురించి ఎంపీ పొన్నం మీరా కుమారికి తెలియజేశారు. తనకున్న ప్రతిభతో చేనేత రంగంలో అనేక అద్భుతాలు సృష్టించారని చెప్పారు. బంగారం, వెండి పోగులతో చీరలను తయారు చేశారని వెల్లడించారు. విజయ్ ప్రతిభను మెచ్చుకున్న మీరా కుమారి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
రాష్ట్రంలో ఏమీ మారలేదు..
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు మీరా కుమార్ నిన్న(జూన్2) హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయిన సమయంలో ఆమె లోక్ సభ స్పీకర్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆమెను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భాగా మాట్లాడిన ఆమె.. తెలంగాణ ప్రజల బాధను అర్థం చేసుకున్న సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలను అందరూ మోసం చేశారని.. తెలంగాణ ప్రజల సమస్యలను ఎవరూ వినలేదు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సోనియా గాంధీ మాత్రమే నెరవేర్చారని వ్యాఖ్యనించారు.









