నకిలీ ఐపీఎస్ అధికారిని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎస్ అధికారిని, ఆర్మీ కల్నల్ అని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఏపీలోని భీమవరం పట్టణానికి చెందిన కార్తీక్ అలియాజ్ నాగరాజుగా గుర్తించారు. ఈ కేసు వివరాలను మాదాపూర్ ఇంఛార్జి డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు.
ఆర్మీ కల్నల్, ఎన్కౌంటర్ స్పెషలిస్టు అని నమ్మించి కార్తిక్ పలు రాష్ట్రాల్లో అక్రమాలకు పాల్పడ్డాడని మాదాపూర్ ఇంచార్జి డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. టెక్నికల్గా ఆరితేరిన కార్తిక్.. ప్రభుత్వ అధికారులు, ధోనీతో ఉన్నట్లుగా ఫొటోలు క్రియేట్ చేశాడని పేర్కొన్నారు. వాటిని చూపిస్తూ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పదవులు ఇప్పిస్తానని కార్తీక్ డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించామన్నారు.
పలు సెటిల్మెంట్లు చేసినట్లు గుర్తించామన్నారు. సైబరాబాద్లో ఏకంగా ఓ కార్యాలయాన్ని ఓపెన్ చేసి.. అక్కడ సెటిల్మెంట్లు చేస్తున్నాడని పేర్కొన్నారు. అతనిపై దేశవ్యాప్తంగా 8 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. మధుసూదన్ అనే వ్యక్తిని బెదిరించడంతో పంజాగుట్టలో కూడా అతనిపై కేసు నమోదైందని తెలిపారు. కార్తీక్ను అరెస్టు చేసి అతని నుంచి ఒక కంట్రీ మేడ్ పిస్టల్తో పాటు 23 వస్తువులను సీజ్ చేశారు. రూ.2 లక్షల విలువైన ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నారు.