ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాల్లో 3 రోజులపాటు కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు (Rains), పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. పశ్చిమ బిహార్ నుంచి ఉత్తర తెలంగాణ వరకు ఛత్తీస్గఢ్ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో 3 రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నేడు అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడనున్నాయి. సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు చెట్ల కింద ఉండరాదని విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు చేసింది.









