‘‘రాష్ట్ర ప్రభుత్వం అత్యంత విలువైన భూములను కారుచౌకగా అమ్ముతోంది. 30 వేల ఎకరాల సర్కారీ భూములను కూడా అమ్మకానికి పెట్టింది’’ అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మంత్రి కేటీఆర్ బడా కంపెనీలకు విలువైన భూముల్ని కట్టబెడుతూ.. సీఈవోలా వాటి నుంచి డబ్బులు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను మిగులు ఆదాయంతో ప్రజలు కేసీఆర్కు అప్పగిస్తే హారతి కర్పూరంలా ఆస్తులను అమ్మి.. అదీ చాలక రూ. 5లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు.
భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బుధవారం మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాలో అన్ని ప్రాజెక్టుల నిర్మాణాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనేపూర్తిచేశామని చెప్పారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి వ్యవస్థలో సమూల మార్పులు చేస్తామని, ఇప్పుడు అమ్ముతున్న ప్రభుత్వ భూములను తిరిగి తీసుకొని పేదలకు పంచుతామని ఆయన చెప్పారు. పాదయాత్ర లో ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకె శైలజానాథ్, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. కాగా, సీఎం కేసీఆర్ తన రాజకీయ ఎదుగుదల కోసం నిబంధనలను అతిక్రమించి ఏపీకి చెందిన బీఆర్ఎస్ నేతకు మియాపూర్లో ఉన్న ప్రభుత్వ భూములను అమ్మారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.









