న్యూఢిల్లీ : నడిరోడ్డుపై ఏనుగులు భీకరపోరుకు తెగబడిన వీడియో (viral video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. నెట్టింట వైరలవుతున్న ఈ క్లిప్లో రోడ్డు మధ్యన రెండు గజరాజులు తలపడటం చూడొచ్చు. దిగ్గజ జంతువులు ఢీకొనడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది.
గజరాజుల ఘర్షణతో అడవి వణికిపోయిందని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఏనుగులు ఒకదానిని మరొకటి తోసుకుంటూ బాహాబాహీకి దిగడం వీడియోలో కనిపిస్తుంది. ఇక ఏనుగులు తలపడిన వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది.
అడవిపై ఏనుగులు తమ ఆధిక్యతను కనబరిచేందుకు కూడా ఇది ఓ సంకేతమని ఓ యూజర్ కామెంట్ చేశారు. అసలు ఈ ప్రమాదకర సన్నివేశాన్ని ఎవరు రికార్డు చేశారనే విషయంలోనూ హాట్ డిబేట్ సాగింది. ఏనుగుల ఫైట్ను కెమెరాలో నిక్షిప్తం చేసిన వ్యక్తి ధైర్యానికి మెచ్చుకోవచ్చని మరో యూజర్ కామెంట్ చేశారు.









