ఐపీఎల్ బెట్టింగ్ కి కేరాఫ్ అడ్రస్గా మారింది హైదరాబాద్. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. రోజూ కోట్లలో బెట్టింగ్ దందా నడుస్తోంది. ఐపీఎల్ తో క్రికెట్ ఫ్యాన్స్ కి మజా ఏమో కానీ… బెట్టింగ్ రాయుళ్లకు మాత్రం అంతకుమించిన పండగగా మారింది.
క్రికెట్ ఫ్యాన్స్ కి ఇలా ఉంటే… బెట్టింగ్ రాయుళ్లకు మాత్రం ఐపీఎల్ కలెక్షన్ల పంట పండిస్తోంది. రెండు నెలలపాటు.. నాన్ స్టాప్ గా డబ్బుల వర్షం కురిపిస్తోంది. అటు పోలీసులు కూడా బెట్టింగ్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. మార్చి 31న ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్లో మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రూ.4.43 కోట్ల సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 54 మంది బెట్టింగ్ నిర్వాహకులను అరెస్టు చేయడంతో పాటు వారి దగ్గరి నుంచి 140 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఐపీఎల్ బెట్టింగ్ దందా… ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
హైదరాబాద్లో ప్రతీ మూలన బెట్టింగ్ దందా నడుస్తోంది. పోలీసుల రైడ్స్ లో రోజుకో ముఠా పట్టుబడుతోంది. హైదరాబాద్ కేంద్రంగా.. పెద్ద ఎత్తున కొన్ని ముఠాలు నెట్వర్క్ విస్తరిస్తున్నాయి. నిన్న ఒక్క రోజే పోలీసుల తనిఖీల్లో 2 కోట్ల నగదుతో అంతర్రాష్ట్ర ముఠాలు పట్టుబడ్డాయి. సోదాలు జరిపిన ప్రతీచోటా లక్షల్లో నగదు లభ్యమవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా వివిధ రాష్ట్రాల్లో ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. బెట్టింగ్కు పాల్పడుతున్న నిందితుల నుంచి భారీగా నగదు లభించింది. ఓ బ్యాంకు ఖాతాలో 1. 84 కోట్ల నగదుతో పాటు 36 ఫోన్లు, మూడు ల్యాప్టాప్లు, ఒక ట్యాబ్… ఇంటర్నెట్ రూటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.









