మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి (MP Avinash Reddy) సీబీఐ (CBI) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 19న మరోసారి విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. ఈరోజు ఉదయం వివేకా కేసులో సీబీఐ విచారణకు అవినాశ్ హాజరుకావాల్సి ఉంది. అయితే అత్యవసర పనుల వల్ల విచారణకు హాజరుకాలేనని.. నాలుగు రోజులు గడువు ఇవ్వాలని సీబీఐను ఎంపీ కోరారు. ఈ మేరకు ఈమెయిల్ ద్వారా అవినాశ్ లేఖ పంపారు.
అయితే తొలుత ఎంపీ విజ్ఞప్తిని సీబీఐ తిరస్కరించింది. విచారణకు హాజరుకావాల్సిందే అంటూ సీబీఐ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విచారణకు హాజరుకాకపోతే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు ఇచ్చి కొన్ని గంటల గడువక ముందే అవినాశ్ లేఖపై సీబీఐ మరోసారి స్పందించింది. ఈ సారి సానుకూలంగా స్పందించిన సీబీఐ ఈనెల 19న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది.









