కేరళ తీరంలో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి.ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఓ షిప్ లో తీసుకొస్తున్న దాదాపు 2,500 కిలోల మెథాంఫెటమిన్ ను నేవీ, నార్కోటిక్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.షిప్ లో ఉన్న పాకిస్థానీ పౌరుడిని అరెస్టు చేశారు.పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ.12 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. సముద్ర మార్గంలో డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు నేవీ, నార్కోటిక్స్ సిబ్బంది సంయుక్తంగా ‘ఆపరేషన్ సముద్రగుప్త్’ పేరుతో ఆపరేషన్ చేపట్టినట్లు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ సింగ్ తెలిపారు.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి వస్తున్న ఈ షిప్ లో స్మగ్లర్లు 134 బస్తాలలో సూపర్ క్వాలిటీ మెథాంఫెటమైన్ ను తీసుకొస్తున్నారని అధికారులు చెప్పారని.. డ్రగ్స్ స్మగ్లింగ్ కు సంబంధించి కచ్చితమైన సమాచారం అందడంతో షిప్ కదలికలపై నిఘా పెట్టినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ షిప్ కేరళ తీరం ద్వారా శ్రీలంకకు వెళుతోందని, వెంట మరో రెండు పడవలు ఎస్కార్ట్ గా వస్తున్నాయని అధికారులు తెలిపారు. డ్రగ్స్ తీసుకెళుతున్న షిప్ ను పట్టుకోవడం చూసి మిగతా రెండు బోట్లలోని స్మగ్లర్లు తప్పించుకున్నారని వివరించారు.









