కర్ణాటక ఎన్నికల మానిఫెస్టోలో బజరంగ్దళ్ను నిషేధిస్తామని కాంగ్రెస్ ప్రకటించడంపై బీజేపీ నేత విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బజరంగ్దళ్ను నిషేధిస్తామని కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రస్తావించడం ఎంత వరకూ సమంజసమో ఆ పార్టీ విశ్లేషించుకోవాలన్నారు. హిందువులు విశ్వసించే భావాలకు, నమ్మకాలకు వ్యతిరేక నిర్ణయాలను ప్రకటిస్తున్న కాంగ్రెస్ను మెజారిటీ ప్రజలు అనుమానించే పరిస్థితిని ఆ పార్టీయే స్వయంగా సృష్టించుకుంటోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ప్రకటనను యూపీఏ భాగస్వాములుగా ఉందామనుకుంటున్న ఎన్ని రాజకీయ పార్టీలు సమర్థిస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. బజరంగ్దళ్పై నిషేధం, ఆర్ఎస్ఎస్పై రాహుల్ తీవ్ర విమర్శలు… ఇవన్నీ ఎంఐఎం వంటి పార్టీల అనుకూలత కోసమే అనే విషయాన్ని ప్రజల్లో ఆలోచన రేపుతోందన్నారు. నిజానికి ప్రజలలో విభజన సృష్టించడమే బీజేపీ విధానమైతే… ఈ రోజు దేశమంతా ఆత్యధికంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల రూపంలో పరిపాలనా బాధ్యతలలో ఉండదని విజయశాంతి పేర్కొన్నారు.









