ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలు కానుందా? నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతోంది? సమ్మర్ తర్వాత అవకాశాలు ఉన్నాయా? దీనిపై ఈసీ వర్గాలు ఏమంటున్నాయి? సెప్టెంబర్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా? ఈ ఎన్నికలు నేతలకు అగ్నిపరీక్షగా మారనుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు ప్రారంభించింది ఎన్నికల సంఘం. ఇప్పుడున్న పాలక వర్గాల పదవీకాలం ముగిసింది. దీంతో అమరాతిలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా. ఈ సమావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖలు, బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. సెప్టెంబర్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, డిసెంబర్ నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆలోచన చేస్తోంది. 2027 జనవరి మొదటి నాటికి కొత్త పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టేలా ప్రణాళిక రెడీ చేసింది.
ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష, సెప్టెంబర్లో నోటిఫికేషన్!
ఈ భేటీలో ప్రధానంగా ఎన్నికల ఏర్పాట్లు, వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని 123 పురపాలక సంఘాల్లో వార్డులు, డివిజన్ల పునర్విభజన ప్రక్రియ కంటిన్యూ అవుతోంది. జూన్ చివరి నాటికి పూర్తి కావచ్చని అధికారులు ఈ సందర్భంగా ఈసీ దృష్టికి తెచ్చారు.
బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం డెడికేటెడ్ కమిషన్ తన నివేదికను జూన్లో ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది. ఈ నివేదిక ఆధారంగా మరుసటి నెల అంటే జులైలో రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 13,291 పంచాయతీలకు ఓటర్ల జాబితా రెడీ చేసినట్టు సమాచారం.
ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేసి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలన్నది ఎస్ఈసీ అంచనా. ఇటు రాజకీయ పార్టీలు సైతం ఇప్పటికే పార్టీల తరపున కమిటీలను వేశాయి. ఇప్పుడు ఆ పనిలో ఉన్నాయి. వర్షాకాలం అయితే ఇబ్బంది వస్తుందేమోనని అంటున్నారు. ఒక వేళ సెప్టెంబర్ కాకున్నా, అక్టోబర్ నాటికైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎస్ఈసీ భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.








