తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని, ఆ కుటుంబం మాత్రం ఆర్థికంగా బలపడిందని ఆయన ఆరోపించారు.
8 లక్షల కోట్ల అప్పు.. కేసీఆర్ ఆస్తులపై ప్రశ్నలు
బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల హయాంలో తెలంగాణ ప్రజల నెత్తిన రూ. 8 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం పడిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రం ఇంతలా అప్పుల్లో మునిగిపోతే, కేసీఆర్ కుటుంబానికి మాత్రం వేల కోట్ల ఆస్తులు ఎలా పెరిగాయో కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. అన్ని రంగాల్లో విఫలమై, తెలంగాణ ప్రజల నుంచి దోచుకున్న అవినీతి డబ్బుతోనే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని, అందుకే ప్రజలు వారికి రాజకీయంగా బొంద పెట్టారని మండిపడ్డారు.
ఫాంహౌస్కే పరిమితమైన కేసీఆర్..
ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తూ, కనీసం అసెంబ్లీకి రాకుండా ఫాంహౌస్కే పరిమితమైన కేసీఆర్ తీరును ప్రజలు గమనిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పేరును ఇకపై ‘ఫాంహౌస్ రాష్ట్ర సమితి’ (FRS) గా మార్చుకునే సమయం ఆసన్నమైందని యావత్ తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు ఆయన ఎద్దేవా చేశారు.
ఫోన్ ట్యాపింగ్పై ఘాటు వ్యాఖ్యలు
బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘సొంత చెల్లి, బావ ఫోన్లనే ట్యాప్ చేసిన వ్యక్తులు ఈ రోజు సభ్యత, సంస్కృతి గురించి మాట్లాడుతుంటే… దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది’ అని దుయ్యబట్టారు.
ఫాంహౌస్ వర్సెస్ ఇందిరమ్మ ఇండ్లు
వచ్చే ఎన్నికలు కేవలం రెండు పార్టీల మధ్యే కాదని, ఒక వైపు ‘ఫాంహౌస్ పార్టీ’కి… మరోవైపు గ్రామ గ్రామాన ‘ఇందిరమ్మ ఇండ్లు కట్టిన పార్టీ’కి మధ్య జరిగే పోరాటమని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఎన్నికల పోటీలో బీఆర్ఎస్ ‘కారు’ మరోసారి తుక్కు తుక్కు కావడం ఖాయమని, ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజల నిర్ణయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.








