AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు కీలక భేటీ..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించారు. సోమవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సుదీర్ఘంగా సమావేశమైన ఆయన.. పోలవరం సహా రాష్ట్రంలోని పలు ప్రధాన ప్రాజెక్టుల పురోగతికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించామని.. దీనికి కేంద్ర జలశక్తి శాఖ పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ కోసం తానే స్వయంగా ఐదుసార్లు క్షేత్రస్థాయిలో పర్యటించిన విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించారు.

 

పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసే క్రమంలో భాగంగా 2011లో జారీ చేసిన ‘స్టాప్ వర్క్ ఆర్డర్’ ఉత్తర్వులను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని చంద్రబాబు కోరారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్‌లో ఉందన్న కారణంతో ఈ ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని.. వీటి తొలగింపు వల్ల పనులకు ఆటంకాలు తొలగుతాయని స్పష్టం చేశారు. ఇప్పటికే కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం 2026 ఏప్రిల్ నాటికి పూర్తయ్యిందని.. గ్యాప్-1, గ్యాప్-2లలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. సాగునీటి అవసరాల దృష్ట్యా పెంచిన కుడి, ఎడమ కాలువల సామర్థ్యానికి (17,500 క్యూసెక్కులు) అయ్యే అదనపు వ్యయాన్ని రీఎంబర్సు చేయాలని మంత్రిని కోరారు.

 

కృష్ణా నదీ జలాల్లో ఏపీ వాటాను కాపాడటంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించారు. సుప్రీం కోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఆలమట్టి ఆనకట్ట ఎత్తును 519.60 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచే అంశంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయవద్దు అని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కర్ణాటక చేపడుతున్న అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ ఫేజ్-III పనులను అడ్డుకోవాలని.. యథాతథ స్థితిని కొనసాగించాలని కోరారు. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర దాహార్తిని తీర్చే పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సముద్రంలోకి వృథాగా పోయే 200 టీఎంసీల గోదావరి వరద జలాలను దీని ద్వారా మళ్లించవచ్చని వివరించారు.

 

రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి వనరుల పునరుద్ధరణ కోసం రూ. 285 కోట్ల నిధులను విడుదల చేయాలని చంద్రబాబు కోరారు. ‘హర్ ఖేత్ కో పానీ’ కార్యక్రమంలో భాగంగా 297 చెరువులు, కుంటల మరమ్మతులు, కాలువల పూడికతీత పనులు చేపట్టాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా భూసేకరణ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ నీటి అవసరాల కోసం కుడివైపున 8 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో హెడ్ స్లూయిస్ నిర్మిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర సాగునీటి రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీఎం చేసిన ఈ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ సానుకూలంగా స్పందించారు.

ANN TOP 10