హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ప్రధాని మోదీ ప్రారంభించిన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రసంగించారు. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్న 2047 వికసిత్ భారత్ సంకల్పానికి అనుగుణంగా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ను రూపొందించినట్లు వెల్లడించారు. ఈ అభివృద్ధి కేవలం ఒక పార్టీకో.. ప్రభుత్వానికో సంబంధించింది కాదని.. ఇది యావత్ తెలంగాణ ప్రజల వికాస ఉత్సవం అని ఆయన అభివర్ణించారు.
దేశ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న ప్రధాని సంకల్పంలో తెలంగాణ 10 శాతం భాగస్వామ్యం (3 ట్రిలియన్ డాలర్లు) వహించాలని లక్ష్యంగా పెట్టుకుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం దేశ జనాభాలో తెలంగాణ వాటా 3 శాతం కంటే తక్కువగా ఉన్నప్పటికీ.. దేశ జీడీపీకి 5 శాతం సహకారం అందిస్తోందని గుర్తు చేశారు. రాబోయే పదేళ్లలో ‘తెలంగాణ మోడల్’ను నిర్మించి 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీకి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎలా సహకరించారో.. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ అదే స్థాయిలో ఆశీస్సులు అందించాలని కోరారు.
దేశాభివృద్ధికి హైదరాబాద్.. ఢిల్లీ.. ముంబై.. బెంగళూరు.. చెన్నై వంటి నగరాలు గ్రోత్ ఇంజిన్లని సీఎం పేర్కొన్నారు. ఈ నగరాల్లో నైపుణ్యాభివృద్ధి.. ఉపాధి కల్పన వేగంగా జరగాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ లేదా సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతిపాదనలు.. అనుమతులను తక్షణమే క్లియర్ చేసేందుకు పీఎంఓలో ప్రత్యేక విభాగం ఉంటే అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు.. మెట్రో విస్తరణ.. మూసీ పునరుజ్జీవనం.. ఫ్యూచర్ సిటీ.. హైదరాబాద్ – బందరు 12 లేన్ల ఎక్స్ప్రెస్ హైవే వంటి ప్రాజెక్టులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని ప్రధానిని కోరారు.
తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని ప్రత్యేకంగా రెండు గంటల సమయం కేటాయిస్తే అన్ని ప్రతిపాదనలు వివరిస్తామని.. అనుమతులు త్వరితగతిన వస్తే దేశ జీడీపీలో తెలంగాణ తన వాటాను 10 శాతానికి పెంచుతుందని సీఎం వాగ్దానం చేశారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితమని.. ఇప్పుడు అభివృద్ధిపైనే తమ దృష్టి అని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆశీస్సులు ఉంటేనే 4 కోట్ల తెలంగాణ ప్రజల కలలు నెరవేరుతాయని.. రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవుతుందని రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఆకాంక్షించారు.








