సింగరేణి సంస్థకు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో కొత్త గనుల ఏర్పాటుకు ముమ్మర సన్నాహాలు చేస్తోంది. బొగ్గు నిల్వలు అయిపోగా మూతపడుతున్న గనుల ఉత్పత్తిని భర్తీ చేయడానికి, అక్కడ పనిచేసే కార్మికులకు ఉపాధిని కొనసాగించడానికి, పెరుగుతున్న రాష్ట్ర ఇంధన అవసరాలు తీర్చడానికి కొత్త గనులను ప్రారంభించాలని, దీనికి సంబంధించిన సన్నాహాలు, అనుమతుల ప్రక్రియలు వేగవంతం చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించింది. దీనిపై సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించి సింగరేణి ప్రాంతంలో 9 ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రణాళిక రూపొందించి, కేంద్ర బొగ్గు, అటవీ, పర్యావరణ శాఖల అనుమతికి ప్రతిపాదనలు సమర్పించింది.
అవసరాల రీత్యా కొత్త గనులు..
ఈ ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇప్పటికే భట్టి విక్రమార్క రెండుసార్లు దేశ రాజధానికి వెళ్లి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి కొత్తగనులకు అనుమతులను వెంటనే మంజూరు చేయాలని, రాష్ట్ర ఇంధన అవసరాల రీత్యా కొత్త గనుల ఆవశ్యకత ఉందని వివరించారు. భట్టి చొరవతో ఇప్పటికే 3 గనులకు అనుమతులు రాగా.. వీటిలో ఒడిశా లోని నైనీ బ్లాకును ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించారు. దాదాపు దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్టు గతేడాది కార్యరూపం దాల్చింది. అలాగే కొత్తగూడెంలో వీకే కోల్ మైన్ కూడా దాదాపు అన్ని అనుమతులను పూర్తి చేసుకుని బొగ్గు ఉత్పత్తికి సిద్ధమైంది. కాగా ఇవి ప్రారంభమైతే రాష్ట్ర ఇంధన అవసరాలు తీరడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
కొత్త ప్రాజెక్టులతో 20 ఏళ్ల పాటు బొగ్గు ఉత్పత్తి..
2027-28 నాటికి సింగరేణిలో నాలుగు గనులు మూతపడుతుండగా.., ఏడాదికి 12.51 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది. అయితే కొత్తగా ప్రారంభించనున్న ఐదు ప్రాజెక్టుల వల్ల ఈ లోటును భర్తీ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంతో సింగరేణి సంస్థ రూపొందించిన 9 కొత్త ప్రాజెక్టుల ద్వారా సింగరేణి సంస్థ మరో 20 సంవత్సరాలకు పైగా ఉత్పత్తి తగ్గకుండా రాష్ట్ర ఇంధన అవసరాలు తీర్చే అవకాశం ఏర్పడుతుంది. సింగరేణి ప్రాంతంలో ఇప్పటికే బొగ్గు తవ్వకాలు పూర్తి చేసుకొని మూతబడిన భూగర్భ గనుల లోతుల్లో ఇంకా మిగిలి ఉన్న బొగ్గు ఖనిజాన్ని వెలికి తీయడానికి ఈ ప్రాజెక్టులను చేపట్టారు. అలాగే ప్రస్తుతం నడుస్తున్న ఓపెన్ కాస్ట్ గనులకు కొనసాగింపుగా కూడా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి.
సింగరేణి రూపకల్పన చేసిన కొత్త ప్రాజెక్టుల వివరాలు
కొత్తగూడెం ఏరియాలో బొగ్గు తవ్వకాలు పూర్తిచేసిన భూగర్భ గనుల నుంచి 190 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు గల వీకే కోల్ మైన్ ప్రధానమైనది. ఈ గనికి సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని అనుమతులు రాగా ఓవర్ బర్డెన్ తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది, త్వరలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించనున్నారు. ఇకపోతే మిగిలిన గనులు అంటే.. జేకే ఓపెన్ కాస్ట్ గని(ఇల్లందు ఏరియా) -19.68 మిలియన్ టన్నులు, రామగుండం ఓసీ-1 విస్తరణ ప్రాజెక్టు(రామగుండం-3 ఏరియా)-181.60 మిలియన్ టన్నులు, లేటి ఓపెన్ కాస్ట్(బెల్లంపల్లి ఏరియా)-38.98 మిలియన్ టన్నులు, ఎంవీకే ఓపెన్ కాస్ట్-30.34 మిలియన్ టన్నులు, మణుగూరు ఓపెన్ కాస్ట్ ఎక్స్ టెన్షన్(మణుగూరు ఏరియా)-40.45 మిలియన్ టన్నులు, ఆర్ కేపీ ఓసీపీ ఫేజ్-2(మందమర్రి ఏరియా)-34.42 మిలియన్ టన్నులు, పీకే కోల్ మైన్, కొండాపూర్(మణుగూరు ఏరియా)-62 మిలియన్ టన్నులు కొత్త ప్రాజెక్టుల్లో ఉన్నాయి.








