రాష్ట్రంలో ప్రతి ఇంటిలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్ ఉండాలనేది ప్రభుత్వ ఆశయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రతి ఇంటిలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను విరివిగా ఉపయోగించుకునేలా ఏఐని రాష్ట్రంలో పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆర్టీజీఎస్పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఒకప్పుడు ఐటీని మనం సొంతం చేసుకున్నామని, ఇప్పుడు ఏఐని పెద్దఎత్తున ఉపయోగించుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ప్రభుత్వంలో టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల పనితీరు మెరుగవుతుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతామని, సత్ఫలితాలు సాధిస్తామని తెలిపారు.
అన్ని శాఖలు టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుని పనితీరు మెరుగుపరచుకోవడం ద్వారా ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. 15 నుంచి 20 శాతం మధ్య వృద్ధి సాధనే లక్ష్యంగా ప్రభుత్వ శాఖలన్నీ పని చేయాలన్నారు. గూగుల్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని, ప్రభుత్వ శాఖలు ఆర్టీజీఎస్తో తమ డేటాను అనుసంధానం చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్లేషించి ఆయా ప్రభుత్వ శాఖల్లో అమలు చేయదగ్గ విషయాలను గూగుల్ సంస్థ సూచిస్తుందని చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవలను త్వరలోనే ప్రారంభించనున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. జనన మరణ ధ్రువీకరణ పత్రాలు కూడా వాట్సాప్ ద్వారా పౌరులు పొందే సదుపాయం కల్పించాలని ఆదేశించారు.
ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వంలోని అన్ని శాఖల డాటాను అనుసంధానం చేసే ప్రక్రియను వేగంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సేకరించిన డేటా ఆధారంగా ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక ప్రొఫైల్ ను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ డేటాలో లేకుండా ఉన్న పౌరుల డేటాను కూడా కొత్తగా సేకరించామని తెలిపారు.