AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మోదీవి అన్నీ గ్యాస్‌ మాటలే.. 150 హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదు

– మెదక్‌ రోడ్‌షోలో మాజీ సీఎం కేసీఆర్‌

బీజేపీ ఎజెండాలో పేదల కష్టాలు, కన్నీళ్లు ఉండవని, ప్రధాని నరేంద్ర మోదీ వట్టి గ్యాస్‌ మాటలు చెబుతారని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విమర్శించారు. మంగళవారం మెదక్‌ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్‌షోలో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. పదేళ్లు అధికారంలో ఉన్న మోదీ 150 హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోదీ రైతుల సంక్షేమాన్ని విస్మరించారని దుయ్యబట్టారు. సబ్‌కాసాత్‌.. సబ్‌కా వికాస్‌ జరగలేదని, అచ్చేదిన్‌ వచ్చాయా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు తీరును కూడా తీవ్ర స్థాయిలో కేసీఆర్‌ ఎండగట్టారు. కృష్ణా నదిని కేఆర్‌ఎంబీకి అప్పగించిన రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సర్కారు.. గోదావరి నదిని కూడా తమిళనాడుకు అప్పగిస్తోందని విమర్శించారు. ఉన్న ఒక్క గోదావరి నది జలాలు తమిళనాడుకు వెళితే.. తెలంగాణ ప్రాజెక్టులు ఏం కావాలని ప్రశ్నించారు. మన నదీ జలాలు మనకు రావాలన్నా, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడుకోవాలన్నా.. ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిపించాలని విజ్ఞప్తి చేవారు.

ఐదు నెలల కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఆగమైందని కేసీఆర్‌ విమర్శించారు. ప్రధానంగా రైతుల పాలిట కాంగ్రెస్‌ సర్కారు శాపంగా తయారైందన్నారు. తమ ప్రభుత్వ హాయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చామని, చేతకాని ప్రభుత్వ పనితీరు కారణంగా ఇప్పుడు కరెంట్‌ కోతలు ఉంటున్నాయన్నారు. ఐదు నెలల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో.. ఇప్పుడు ఎంత ఆగమైతోందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్‌ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిందని, 420 వాగ్దానాలు ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ఉచిత బస్సు పథకంతో మహిళలు కొట్టుకుని చస్తున్నారని, ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఎద్దేవా చేశారు.

కొత్త జిల్లాలను తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వాటిని తీసేస్తామని కాంగ్రెస్‌ అంటోందని కేసీఆర్‌ పేర్కొన్నారు. జిల్లాలు ఉండాలంటే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వ హాయాంలో పలు అభివృద్ది పనుల కోసం నిధుల మంజూరును రద్దు చేస్తున్నారని, దీన్ని ప్రజలు గమనించాలన్నారు. మిషన్‌భగీరథ పథకం తాగునీటిని సరిగ్గా సరఫరా చేయలేకపోతున్నారని, వరికి రూ.500 బోనస్‌ ఇవ్వలేదని, ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందని కేసీఆర్‌ ప్రశ్నించారు.

ANN TOP 10