AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భారీ వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ!

హైద‌రాబాద్‌: తెలంగాణలో భారీ వర్షాలు పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అలాగే భారీ వ‌ర్షం, ఈదురుగాలుల‌తో రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యమ‌వ‌డం, ట్రాఫిక్ స‌మ‌స్యలు, విద్యుత్ అంత‌రాయాల‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు( మంగళవారం) స‌మీక్షించారు. వ‌రంగ‌ల్ ప‌ర్యటనలో ఉన్నసీఎం అక్కడి నుంచే జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ రోనాల్డ్ రోస్‌, సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ కె.శ్రీ‌నివాసరెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ ఎస్‌.ఏ.ఎం రిజ్వి, ఇత‌ర ఉన్నతాధికారుల‌తో స‌మీక్షించారు.

భారీ వ‌ర్షాలు, ఈదురుగాలుల‌తో ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింద‌ని అధికారులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ముఖ్యమంత్రి వెంట‌నే స‌మ‌స్యను త్వరితగతిన ప‌రిష్కరించి విద్యుత్ స‌ర‌ఫ‌రాను పున‌రుద్ధరించాల‌ని ఆదేశించారు. లోత‌ట్టు ప్రాంతాల్లో జ‌ల‌మ‌య‌మైన కాల‌నీల్లో ప్రజకు అవ‌స‌ర‌మైన చేయూత‌ను అందించాల‌ని సూచించారు.

న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్యను సాధ్యమైనంత త్వరగా క్లియ‌ర్ చేసి వాహ‌న‌దారులు త్వరగా ఇళ్లకు చేరుకునేలా చూడాల‌ని పోలీసు అధికారుల‌ను ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది చేప‌ట్టే స‌హాయ‌క చ‌ర్యల్లో భాగ‌స్వాములు కావాల‌ని, స‌మ‌స్య తీవ్రత ఎక్కువ‌గా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల‌కు సూచించారు.

ANN TOP 10