ఐపీఎల్ టోర్నమెంట్లో ఆటగాళ్లు రికార్డును తిరగరాస్తున్నారు. ప్రతి మ్యాచ్లో బ్యాటర్లు, బౌలర్లు స్టేడియాల్లో రికార్డుల మోత మోగిస్తున్నారు. తాజాగా ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో మూడు వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గా రికార్డుకెక్కాడు. 3 వేల పరుగుల మార్క్ను పంత్ కేవలం 2028 బంతుల్లోనే అందుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో శుక్రవారం నాటి మ్యాచ్లో 41 పరుగులు చేసి ఈ రికార్డును అందుకున్నాడు. రిషభ్ పంత్ తర్వాత స్థానంలో యూసుఫ్ పఠాన్ 2062, సూర్యకుమార్ యాదవ్ 2130, సురేశ్ రైనా 2135, మహేంద్ర సింగ్ ధోనీ 2152 తక్కువ బంతుల్లో 3 వేల పరుగులు చేసిన ప్లేయర్లు ఉన్నారు. కారు ప్రమాదానికి గురై దాదాపు 16 నెలల పాటు ఆటకు దూరమైన పంత్ ఐపీఎల్ – 2024 లో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో పంత్ ఆకట్టుకుంటున్నాడు. ఆరు మ్యాచ్ల్లో 194 పరుగులు చేశాడు. దీనిలో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్థానంలో పంత్ ఉన్నాడు.









