AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నేత పులిమామిడి రాజు

ఎన్నికల వేళ మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి పులి మామిడి రాజు హస్తం గూటికి చేరారు. ఈ మేరకు ఆయన శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌తో కలిసి చేరుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి పులి మామిడి రాజుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ఆకర్షితులై పార్టీలోకి వచ్చేవారికి వెల్కమ్ చెబుతుందన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన పులి మామిడి రాజును సీఎం అభినందించారు.

దీపాదాస్ మున్షీతో భేటీ..

అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుతో కలిసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కలిశారు. కొద్దిసేపు ఆమె పార్టీ వ్యవహారాలపై నీలం మధు, పులి మామిడి రాజుతో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి నీలం మధు సమక్షంలో పులి మామిడి రాజుకు దీపాదాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో సంగారెడ్డి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పులి మామిడి రాజు ఈ ఎంపీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ANN TOP 10