రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్
కాళేశ్వరంపై కాలుదువ్వుతున్న సీఎం
కృష్ణా జలాలపై కారాలు నూరుతున్న మాజీసీఎం
ఎంపీ ఎన్నికల వేళ వేడెక్కిన రాజకీయాలు
నేటి అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరంపై కాంగ్రెస్.. కృష్ణా జాలాలపై బీఆర్ఎస్ చర్చకు సై అంటే సై అంటున్నాయి. ఉత్తర తెలంగాణకు అన్యాయమంటూ సీఎం రేవంత్.. దక్షిణ తెలంగాణకు దగా అంటూ కేసీఆర్ మాటల తూటాలు పేలుస్తున్నారు. ఎంపీ ఎన్నికల వేళ రాష్ట్రంలో ‘పానీ’పట్టు యుద్ధం మొదలైంది. రాష్ట్రం అంతా ఈ విషయంపైనే చర్చ జరుగుతోంది.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధం అయింది. నేటి నుంచి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం అసెంబ్లీ సమావేశాలు జరగడం వరుసగా ఇది రెండోసారి. ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుతో పాటు వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయింపులపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. తొలిరోజు సమావేశాల్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే గవర్నర్ ప్రసంగాన్ని కేబినెట్ ఆమోదం తెలిపింది. గవర్నర్ స్పీచ్ అనంతరం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ప్రవేశపట్టనున్నారు.
ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్పై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నీటిపారుదల శాఖకు సంబంధించిన శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ మానస పుత్రికగా చెప్పబడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ను సభలో ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీబీఐ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు కేఆర్ఎంబీ అంశాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలే అవకాశం కనిపిస్తోంది. ఇక అధికారం కోల్పోయాక ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అవుతారు. గత సమావేశాల్లో కేటీఆర్, హరీశ్ రావు టార్గెట్ గా రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈసారి కేసీఆర్ సభకు హాజరయితే రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ మధ్య డైలాగ్ వార్ ఎలా ఉండబోతున్నది అనేది సర్వత్రా హాట్ టాపిక్గా మారింది.









