ఛత్తీస్గఢ్లో మరోమారు నక్సలైట్స్ తమ ఉనికిని చాటుకున్నారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా-బీజాపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన టేకల్గూడెం గ్రామంలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై నక్సలైట్లు భారీ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు దుర్మరణం చెందినట్టుగా తెలిసింది. మరో 14 మంది సైనికులు గాయపడినట్టుగా తెలిసింది. మరోవైపు, దాడి గురించి సమాచారం అందుకున్న బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దాడి చేసిన వారి కోసం ముమ్మర గాలింపు చేపట్టాయి. గాయపడిన జవాన్లను చికిత్స కోసం రాయ్పూర్కు విమానంలో తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్తర్ డివిజన్లోని సుక్మా-బీజాపూర్ సరిహద్దుల్లోని జాగర్గుండ కొండల సమీపంలోని తీవ్ర తిరుగుబాటు ప్రభావిత ప్రాంతంలోని టేకుల్గూడెం గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన భద్రతా శిబిరంపై మావోయిస్టులు కాల్పులు జరిపారు.
CRPF కోబ్రా-ఎలైట్ యూనిట్ భద్రతా సిబ్బంది, స్పెషల్ టాస్క్ ఫోర్స్, జిల్లా రిజర్వ్ గార్డ్స్ క్యాంపు సమీపంలో, జోనగూడ-అలిగూడ ప్రాంతం చుట్టూ నక్సల్స్ కాల్పులు జరపడంతో.. జవాన్లు ప్రతీకారం తీర్చుకోవడంతో ఎన్కౌంటర్కు దారితీసింది. మావోయిస్టులు ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారని, భద్రతా శిబిరంపై బీజీఎల్ను ఉపయోగించారని పోలీసులు తెలిపారు.









