AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్ కుటుంబంపై దర్యాప్తు జరుగుతోంది.. మోదీ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం కీలక దశకు చేరుకుంది. ఈ క్రమంలో.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈరోజు తుప్రాన్, నిర్మల్ నియోజకవర్గాల్లో మోదీ ప్రచారం నిర్వహించగా.. సీఎం కేసీఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సర్కారులో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని మోదీ తెలిపారు. నిరుద్యోగులు, మహిళలే కాకుండా రైతులు కూడా కేసీఆర్ సర్కారుపై అసహనంతో ఉన్నారన్నారు. అభివృద్ధి అంటే ఏంటో బీజేపీ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్‌కు చూపిస్తామన్నారు మోదీ. కేసీఆర్ కేవలం కుటుంబ లబ్ధి కోసమే మళ్లీ గెలవాలనుకుంటోందని ఆరోపించారు.

ప్రాజెక్ట్‌ల పేరుతో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిందని మోదీ ఆరోపించారు. ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి భూములు లాక్కొని.. చిత్రహింసలకు గురిచేశారన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమన్నారు. ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తామని బీఆర్ఎస్‌ మాట తప్పిందని.. కానీ, బీజేపీలో అలా ఉండదన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతే.. ముఖ్యమంత్రి అవుతారని మరోసారి స్పష్టం చేశారు. బీజేపీ మాట ఇచ్చిందంటే.. అది నెరవేర్చి తీరుతుందని చెప్పారు మోదీ.

సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లోనే ఉంటూ.. కనీసం సచివాలయానికి కూడా రాడని మోదీ మండిపడ్డారు. ప్రజలను పట్టించుకోని ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా అని అడిగారు. కేసీఆర్‌ను శాశ్వతంగా ఫాంహౌస్‌కే పరిమితం చేయాలని ప్రజలు భావిస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు రెండూ ఒకటేనని.. బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ కార్బన్ కాపీ అని ఆరోపించారు. ఈ రెండు పార్టీల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు చేసిన అవినీతిపై కూడా దర్యాప్తు జరుగుతోందని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ANN TOP 10