హైదరాబాద్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. టెలివిజన్ షోలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని నమ్మబలికిన ఇద్దరు వ్యక్తులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సికింద్రాబాద్లోని రాణిగంజ్లో మంగళవారం జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 43 ఏళ్ల బాధితురాలు, వరకట్న వేధింపులు మరియు కుటుంబ కలహాల కారణంగా గత రెండేళ్లుగా భర్తకు దూరంగా ఉంటూ, తన ఏడేళ్ల కుమారుడితో కలిసి జీవిస్తున్నారు. తన కుటుంబ సమస్యలను పరిష్కరించేందుకు ఒక టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొనాలని ఉద్దేశంతో ఆమె హైదరాబాద్కు వచ్చారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉండగా ఓ వ్యక్తి ఆమెను పరిచయం చేసుకుని, టీవీ షో నిర్వాహకులతో తనకు పరిచయాలు ఉన్నాయని నమ్మబలికాడు. అనంతరం ఆమెను రాణిగంజ్లోని హైదర్ కాంప్లెక్స్లో ఉన్న ఒక నిర్మానుష్య భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరో వ్యక్తి కూడా అక్కడికి చేరుకుని ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం ఆమె నేరుగా మహంకాళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులుగా అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.








