AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన కిషన్ రెడ్డి..! ఢిల్లీలో ధర్నా చేయండి.. వాస్తవాలు చెబుతాం అంటూ వాఖ్యలు..!

ధాన్యం కొనుగోళ్లు, రైస్ మిల్లింగ్ మరియు కేంద్ర నిధుల విడుదలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ వేదికగా ఆయన మాట్లాడిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ మందగమనం, కేంద్రం ఇస్తున్న రుణాల వినియోగం, సన్నబియ్యం పంపిణీలో కేంద్ర వాటాపై కీలక వ్యాఖ్యలు చేశారు.

 

కొనుగోళ్లలో వైఫల్యం..

 

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కిషన్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ముందే అంగీకారం తెలిపినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సేకరణను సకాలంలో ప్రారంభించలేకపోయిందన్నారు. బీజేపీ చేపట్టిన ‘రైతు గోస’ ఉద్యమం తర్వాతే రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందని, ఆ తర్వాతే కొనుగోళ్లను వేగవంతం చేశారని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్ ప్రక్రియల కోసం ఒక పక్కా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

 

పాత బాటలోనే కాంగ్రెస్..

 

రైస్ మిల్లులలో ధాన్యాన్ని వేగంగా మిల్లింగ్ చేయించి, ఆ బియ్యాన్ని భారత ఆహార సంస్థ (FCI) కి పంపాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. గత ఖరీఫ్ (2024-25) సీజన్‌కు గాను 36 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు కేంద్రం అంగీకరిస్తే.. ఇప్పటివరకు కనీసం 13 నుంచి 14 శాతం బియ్యాన్ని కూడా రాష్ట్రం ఎఫ్‌సీఐకి పంపలేకపోయిందని మండిపడ్డారు. అంతేకాదు, 2024-26 ఖరీఫ్ సీజన్ బియ్యం కూడా ఇంకా ఎఫ్‌సీఐ గిడ్డంగికి చేరలేదన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు.

 

వేల కోట్ల కేంద్ర రుణాలు..

 

ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్‌సీడీసీ (NCDC) ద్వారా రాష్ట్రాలకు పెద్ద ఎత్తున రుణాలు ఇస్తోందని కిషన్ రెడ్డి వివరించారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 2024-26 కాలానికి రూ. 37 వేల కోట్ల రుణాలు ఇచ్చామని, అలాగే 2026-27 సంవత్సరానికి కూడా సుమారు రూ. 23 వేల కోట్ల రుణాలను కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. కేంద్రం ఇంతగా సహకరిస్తున్నా, రైతుల ధాన్య ఉత్పత్తి స్థాయికి తగ్గట్టుగా రాష్ట్రంలో మౌలిక వసతులను పెంచడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఢిల్లీలో ధర్నా చేయండి.. వాస్తవాలు చెబుతాం!

 

కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఢిల్లీకి వచ్చి కలిసి ధర్నా చేసినా తమకు అభ్యంతరం లేదని, ఎక్కడైనా తాము వాస్తవాలు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. చివరగా, రాష్ట్రంలో పేదలకు పంపిణీ చేసే సన్నబియ్యం పథకంలో కూడా దాదాపు 70 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని, ఈ వాస్తవాన్ని ప్రజలు గమనించాలని ఆయన పేర్కొన్నారు.

ANN TOP 10