AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎన్ఐఏ సోదాల్లో బిగ్ ట్విస్ట్..! ఉగ్రసంస్థలతో హైదరాబాద్ మహిళకు లింక్..?

ఆన్ లైన్ టెర్రర్ రాడికలైజేషన్ నెట్ వర్క్ కేసులో ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బుధవారం తెల్లవారుఝాము నుంచే విజయవాడ వించిపేట పరిసర ప్రాంతాల్లో ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ముగ్గురు నిందితుల ఇళ్లల్లో అధికారులు తనిఖీలు జరిపారు. ఈ ముగ్గురికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? గతంలో వాళ్లు తిరిగిన ప్రాంతాల్లోని డిజిటల్ ఆధారాలు, కమ్యూనికేషన్ డివైస్ లు, ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరించారు. దాంతోపాటు పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.

 

ఉగ్ర కుట్రలు..

విజయవాడకు చెందిన మహ్మద్ రహమతుల్లా షరీఫ్ సోషల్ మీడియా వేదికల ద్వారా జిహాదీ కంటెంట్ ను ప్రచారం చేస్తున్నట్టు గుర్తించిన విజయవాడ టూ టౌన్ పోలీసులు మార్చి 22న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతన్ని జరిపిన విచారణలో వెల్లడైన వివరాల మేరకు భవానీపురానికి చెందిన మహ్మద్ డానిష్, మహంతిపురం నివాసి మీర్జా సొహైల్ బేగ్ లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ చంచల్ గూడ ప్రాంతంలో ఉంటున్న సయీదా బేగం ఆన్ లైన్ ద్వారా రిక్రూట్ మెంట్లు జరుపుతున్నట్టు నిర్ధారించుకుని ఆమెను కూడా అరెస్ట్ చేశారు. వీరి నెట్ వర్క్ తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా ఉన్నట్టు వెల్లడైన నేపథ్యంలో మే 13న ఎన్ఐఏ అధికారులు కేసులు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు.

 

నిషేధిత ఉగ్ర సంస్థలు..

ఈ క్రమంలో 13మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో 12మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరిని జరిపిన విచారణలో నిందితులు అల్ మాలిక్ యూత్ ఇస్లామిక్ కమిటీ (ఏఎంవైఐసీ) పేరుతో సోషల్ మీడియాలో గ్రూపులు ఏర్పాటు చేసి యువతను ఉగ్రవాదం బాటలోకి నడిపించేందుకు నిషేధిత ఉగ్ర సంస్థలైన ఐఎస్ఐఎస్, ఏక్యూఐఎస్ జిహాదీ వీడియోలను ప్రచారం చేశారు. ఇన్ స్టాగ్రాం ద్వారా అల్ హకీం షుకూర్ అనే హ్యాండ్లర్ తో సంబంధాలు సాగిస్తూ ఆన్ లైన్ లో పేలుడు పదార్థాలను ఎలా తయారు చేయాలన్న దానిపై సమాచారాన్ని కూడా సేకరించారు. ఇదే కేసులో ఎన్ఐఏ అధికారులు బుధవారం బీహార్, రాజస్థాన్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ లో కూడా సోదాలు జరిపినట్టు సమాచారం.

ANN TOP 10