ఎన్నికల ప్రచార జోరును మరింత వేగవంతం చేసింది తెలంగాణ కాంగ్రెస్. ఓ వైపు ఏఐసీసీ అధ్యక్షుడు.. ఇంకోవైపు పీసీసీ ప్రెసిడెంట్.. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. 6 గ్యారంటీలు, 66 హామీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అగ్రనేతల పర్యటనలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది. ఇప్పటికే కొనసాగిస్తున్న ప్రచారాన్ని.. మరింత స్పీడప్ చేసింది. ఏఐసీసీ అగ్రనేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. అభ్యర్థులకు మద్దుతుగా ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
ఆలంపూర్ కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. కేసీఆర్ టార్గెట్గా విమర్శలు సంధించారు. అభివృద్ధిని పట్టించుకోకండా ఫామ్హౌస్కే పరిమితం అయ్యారని ఆరోపించారు.
మరోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ఇవాళ కూడా సుడిగాలి పర్యటనలు చేశారు. నిజామాబాద్ రూరల్, నారాయణఖేడ్, గజ్వేల్ సభల్లో పాల్గొని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు వస్తాయో వివరించారు. తెలంగాణలో వచ్చేది బరాబర్ ఇందిరమ్మ రాజ్యమేనని ధీమా వ్యక్తం చేశారు రేవంత్.
ప్రచారాన్ని మరో లెవెల్కి తీసుకెళ్లాలని భావిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఆరు గ్యారంటీలు.. అరవై ఆరు హామీలను గడప గడపకి తీసుకెళ్లాలని ప్రణాళికలు రచిస్తోంది. త్వరలో రాహుల్, ప్రియాంకల టూర్లతో పార్టీకి మరింత మైలేజ్ వస్తుందని లెక్కలేసుకుంటోంది.









